ఈ నెల 28 నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరిస్తాం: పొంగులేటి

  • ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్
  • ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు
  • ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు
తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో, ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలు తెలిపారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. 

ముందుగా ఈ దరఖాస్తులను ప్రజలకు అందిస్తామని, ఆపై వాటిని డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని వివరించారు. గ్రామసభల్లో ఈ దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులు సమర్పించిన వారికి అధికారులు ఒక రసీదు ఇస్తారని పొంగులేటి చెప్పారు. అధికారులు ఆ దరఖాస్తులు పరిశీలించి, వారు ఏ పథకాలకు అర్హులో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఓ ప్రాంతంలో కేవలం 10 ఇళ్లు ఉన్నా సరే, అధికారులు అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించామని పొంగులేటి స్పష్టం చేశారు. 

తామిచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామని, మిగిలిన నాలుగింటిని కూడా అమలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందని అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ  సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై వివరాలు తెలిపారు.

Ponguleti Srinivas Reddy
Six Guarantees
Applications

More Telugu News